తెలుగుభాష
మనుగడ, వినియోగంపై చర్చ మళ్లీ ప్రారంభమైంది. ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’,
‘దేశభాషలందు లెస్స’ అనిపించుకుంది తెలుగు. ఇది దక్షిణ భారతంలోని సంస్కృతి,
చరిత్ర, సాహిత్యానికి
ప్రతీక. ఆసియాలోని వివిధ దేశాలతో పాటు, దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగర
ఉన్నత పాఠశాలలోనూ తెలుగు రెండో భాషగా కొనసాగుతోంది. ఎంతో ఘనత కలిగిన ఈ భాష,
భారత్లో పలువురు మాట్లాడే రెండో పెద్ద భాషగా ఖ్యాతి పొందింది. తల్లిభాషలో
బోధన సాగితే- విద్యార్థులకు పాఠ్యాంశాలు, వాటి
ప్రణాళిక పట్ల సరైన అవగాహన కలుగుతుంది. బోధన మొదట ప్రారంభమయ్యేది పాఠశాలలో
కాదు, గృహంలో... అదీ మాతృభాషలో! అదే భాష బడిలోనూ కొనసాగితే, విషయ
పరిజ్ఞానం విస్తరిస్తుంది. మాతృభాష తల్లిపాల వంటిది. ఇతర భాష పోతపాలతో
సమానం. పాఠశాలలో విద్యార్థి మాతృభాష అక్కడ గృహ వాతావరణాన్ని
కల్పిస్తుంది. అతడి భావ వ్యక్తీకరణకు అది ఎంతో ఉపయోగపడుతుంది.
స్ఫూర్తిదాయక సేవ
ప్రపంచవ్యాప్తంగా
దాదాపు 7.5 కోట్లమంది పిల్లలకు మాతృభాషలో బోధన కరవవుతోందని ‘యునెస్కో’
వెల్లడించింది. ప్రాథమిక విద్యాబోధన పిల్లల మాతృభాషలోనే సాగితే, అభివృద్ధి
తథ్యమని
పేర్కొంది. మాతృభాషలోనే బోధనకు వనరులు పెంపొందించుకోవాలని, అటువంటి దేశాలే
లక్ష్యాలు చేరుకోగలవని ఆ సంస్థ స్పష్టీకరించింది. మూడు లక్షలమంది మాట్లాడే
‘చెరోకి’ అనే ప్రాంతీయ భాష పరిరక్షణకు అమెరికా ప్రభుత్వం నడుం బిగించింది.
దాదాపు 30 లక్షల డాలర్లు కేటాయించి, ఆయా పాఠశాలల్ని
ప్రారంభించింది. ఆ నిధుల్ని ఉపాధ్యాయ శిక్షణకు, పాఠ్యప్రణాళికలు సిద్ధం
చేయడానికి ఉపయోగించాలని విద్యాశాఖను ఆదేశించింది. అమెరికాలో స్థానిక తెగలు
మాట్లాడుకునే ఒక భాష పరిరక్షణకు, అక్కడి ప్రభుత్వం సాగిస్తున్న ఈ తరహా కృషి
భారత్ సహా అన్ని దేశాలకూ స్ఫూర్తిదాయకం. మాతృభాష
పరిరక్షణ కోసం అందులోనే ప్రాథమిక విద్యాభ్యాసం సాగాలన్న సూత్రాన్ని అనేక
దేశాలు విశ్వసిస్తున్నాయి. 1997 వరకు బ్రిటిష్ పాలనలో ఉన్న హాంకాంగ్లోనూ
ఆంగ్లభాషతో సమానంగా స్థానిక ‘కెంటోనీస్’ భాషలోనూ విద్యాబోధన సాగింది.
అత్యధిక సంఖ్యలో విద్యార్థులు కలిగిన చైనాలో మాతృభాషను
పరిరక్షిస్తూ, అన్ని పాఠశాలల్లోనూ ఆ భాషలోనే బోధన కొనసాగిస్తున్నారు.
హాంకాంగ్ బోర్డు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో చైనీస్ భాషతో పాటు
ఆంగ్లంలోనూ చైనీయులు సమాన ప్రతిభ కనబరిచారు. స్వీడన్ వాసులు మాతృభాషలోనే
విద్యాబోధన సాగిస్తూ, ఆంగ్లభాషలోని భావాన్ని అనువదించుకుంటూ
ముందడుగు వేస్తున్నారు. జపనీస్- పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లోనూ
బోధనభాషగా ఉంటోంది. ఉత్తర, దక్షిణ కొరియాల్లోనూ ఇదే విధానం ఉంది. ఆనంద
సూచికలో మొదటి స్థానం పొందిన ఫిన్లాండ్ దేశంలో ప్రాథమిక విద్య పూర్తిగా
మాతృభాషలోనే సాగుతోంది. ఐస్లాండ్, నార్వే, రుమేనియా
వంటిచోట్లా విద్యాబోధన మాతృభాషల్లోనే! ఫిలిప్పీన్స్, సింగపూర్,
కాంబోడియా, వియత్నాం, థాయ్లాండ్, మలేసియా దేశాల పాఠశాలల్లో ప్రాథమిక
విద్యాబోధన వారివారి తల్లిభాషల్లోనే కొనసాగుతోంది. ఆఫ్రికా దేశాలైన
టాంజానియా, జింబాబ్వేలు మాతృభాషల్ని కాపాడుకుంటూ ప్రాథమిక స్థాయుల్లో
తమ మాతృభాషల్లోనే బోధనలు సాగిస్తున్నాయి. ఇథియోపియా పాఠశాలల్లో
విద్యాబోధనను పూర్తిగా వారి మాతృభాషలోనే నిర్వహిస్తున్నారు. ఫిలిప్పీన్స్
ప్రభుత్వం అక్కడి మాతృభాషకే బోధనరంగంలో ప్రాధాన్యమిస్తూ ఇటీవల ఓ నూతన
విధానం తెచ్చింది.
అందరినోటా అమ్మమాట
సోక్రటీస్,
ప్లేటో, అరిస్టాటిల్ తమ మాతృభాషల్లోనే గ్రంథాలు రచించారు. నోబెల్
సాహిత్య బహుమతులు అందుకున్నవారిలో అనేకులు తల్లిభాషలో రాసినవారే. విశ్వకవి
రవీంద్రుడు ప్రాథమికంగా
బెంగాలీలో రచించిన అనంతరం ఆంగ్లంలోకి తర్జుమా అయిన ‘గీతాంజలి’కి నోబెల్
పురస్కారం లభించింది. విఖ్యాత కవి టాల్స్టాయ్ రచనలన్నీ మాతృభాషలోనివే.
పలువురు సాహితీవేత్తలకు మాతృభాషల్లో అంత పట్టు లేకుంటే, ప్రపంచం అంత గొప్ప
గ్రంథాల్ని చూసి ఉండేది కాదు. తల్లిభాషే మనిషి
జీవితాన్ని ప్రతిబింబిస్తుందని మహాత్మాగాంధీ విశ్వసించారు. తన పన్నెండో ఏట
వరకు మాతృభాష గుజరాతీలోనే చరిత్ర, లెక్కలు, భూగోళ శాస్త్రాలు చదివానని ఆయన
ఆత్మకథలో రాసుకున్నారు. ఆ తరవాత పాఠశాల నిబంధనల ప్రకారం ఇతర భాషలు
నేర్వాల్సి వచ్చిందని, అందుకు ఎంతో సమయం వృథా అయిందని
ఆయన వెల్లడించారు.
ఉభయ రాష్ట్రాల్లో కృషి
పలు
ప్రపంచ దేశాలు తమ మాతృభాషల్ని భావి తరాలకు కానుకలుగా అందించాలని శతవిధాల
ప్రయత్నిస్తున్నాయి. కానీ- ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు
మాతృభాషలో ఒక్క ముక్కా
నేర్చుకోకుండానే విద్యాభ్యాసం పూర్తిచేసే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో
ఉంది! దేశంలోని మరి ఏ ఇతర రాష్ట్రంలోనూ తల్లిభాష నేర్వకుండా ఉన్నతవిద్య
పూర్తిచేసే అవకాశం లేదు. ఈ ‘ఉపద్రవం’ గమనించిన తెలంగాణ ప్రభుత్వం అన్ని
పాఠశాలల్లోనూ ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు తెలుగును
పాఠ్యాంశంగా బోధించాలన్న నిర్ణయం తీసుకొంది. ప్రాథమిక, మాధ్యమిక,
ఇంటర్మీడియట్ పాఠ్య ప్రణాళికలు తయారుచేయాలని తెలుగు అకాడమీని ఆదేశించింది.
ఎటువంటి పరీక్షలకైనా అకాడమీ పుస్తకాలే ప్రామాణికమని తెలియజేస్తూ, మాతృభాష
పరిరక్షణకు ప్రభుత్వం సంసిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం-
మాతృభాష తెలుగుకానివారైనా, ఇతర మాధ్యమాల్లో అభ్యసించేవారైనా ఇకముందు
తెలుగు పాఠ్యాంశాలను తప్పనిసరిగా చదవాలన్న నిబంధన తెస్తోంది. దీనికి
సంబంధించి ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
మాతృభాషకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తుందని కర్ణాటక
గతంలోనే ప్రకటించింది. మాతృభాషా వికాసానికి ఉపక్రమించిన తమిళులు
ఇంజినీరింగ్లోని సివిల్, మెకానికల్ విభాగాల్లో తమ భాషాబోధన
ప్రారంభించారు. తమిళ భాషలో పాఠశాల విద్యనభ్యసించినవారు 80 శాతం, ఆంగ్లంలో
చదివిన 20 శాతం విద్యార్థులతో అక్కడి ఇంజినీరింగ్ సీట్లు భర్తీ కావడం
గమనార్హం. డిగ్రీస్థాయిలో పూర్తిగా తమిళ మాధ్యమంలోనే బోధన
కొనసాగిస్తామంటూ, ఆ రాష్ట్రంలోని అన్నా విశ్వవిద్యాలయానికి దాని అనుబంధ
కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆంగ్ల, తమిళ అనువాదాల ప్రత్యేక
నిఘంటువుల్ని తమిళ భాషాపండితులు ఇప్పటికే రూపొందించారు. ఇటువంటి వాటిని
అంతర్జాలంలో అందుబాటులో ఉంచడం, భాషాసంబంధ సంశయ నివృత్తికి ఎంతగానో
ఉపయోగపడుతుంది. ఒడిశాలోనూ ప్రాథమిక పాఠశాల బోధనను మాతృభాషలోనే
కొనసాగిస్తున్నారు.
ఆంగ్ల
మాధ్యమ పాఠశాలల్లోనూ మాతృభాషను ఒక అంశంగా విధిగా బోధించాల్సిందే.
కేంద్రంతో తమిళనాడు ప్రభుత్వం ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించేటప్పుడు,
ఆంగ్లంతో పాటు తమిళ ప్రతినీ
తప్పనిసరిగా జతచేస్తోంది. తమిళ మాధ్యమ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో
అయిదు శాతం మార్కుల్ని అదనంగా కలుపుతున్నారు. అక్కడ తమిళ మాధ్యమంలో
చదవనివారికి రాష్ట్రస్థాయి ర్యాంకులు ఇవ్వరు. తెలుగు భాషలో బోధనను ఇతర
భాషలతో బేరీజు వేసుకుంటే, పరిస్థితి అంత ఆశాజనకంగాలేదు.
పదో తరగతిలో మాతృభాషలో రాసేవారు సగానికిపైగా తగ్గిపోయారని గణాంకాలు
తెలియజేస్తున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగువారు మాతృభాషా పరిరక్షణకు
శ్రమిస్తున్నారు. అక్కడ తెలుగు సంఘాలు ఏర్పాటుచేసుకొని, ప్రైవేటుగా తెలుగు
పాఠశాలల్లో తమ పిల్లలకు మాతృభాష నేర్పిస్తున్నారు. తెలంగాణలో
తొమ్మిది లక్షలమంది ఇంటర్ చదువుతుండగా, వారిలో మాతృభాషలో బోధన
అందుకుంటున్నవారు కేవలం మూడు లక్షలమంది! వారిలో లక్షా 80 వేల మంది ప్రభుత్వ
కళాశాలల విద్యార్థులు. ఒకటి నుంచి పదో తరగతి వరకు 60 లక్షలమంది
విద్యార్థులుంటే, సగం మందే మాతృభాషలో విద్య అభ్యసిస్తున్నారు. దిల్లీలో
ఓ తెలుగు సంస్థ నిర్వహిస్తున్న ఏడు పాఠశాలల్లో ఆ భాషను తప్పనిసరి చేశారు.
మారిషస్లోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు కోర్సుకు గుర్తింపు
లభించింది.
నైపుణ్యాల పెంపుదల
ఎంసెట్లో
25 శాతం, జేఈఈ మెయిన్స్లో 40 శాతం ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉంది.
దీంతో, కార్పొరేట్ కళాశాలలు తెలుగు బదులు ఇతర భాషలో పరీక్షలు రాయించి,
విద్యార్థుల్ని మాతృభాష
నుంచి దూరం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సీబీఎస్సీ పాఠశాలల్లో
నాలుగో తరగతి వరకు తెలుగు లేదు. అయిదో తరగతి నుంచి ఉన్నా, అది ఐచ్ఛికమే!
ఇటువంటి పరిస్థితి ఉండటం వల్ల- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చదువు
మొత్తాన్నీ తెలుగు రాకుండానే పూర్తిచేయవచ్చు! వాడుక భాషను,
అందులో వస్తున్న మార్పులను ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలి. సామాజిక
అనుబంధ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ పాఠ్యప్రణాళికలో మార్పులు తేవాలి.
అప్పుడే మాతృభాష వైపు పిల్లలు ఆకర్షితులవుతారు. మాతృభాషేతర బోధన ఉపాధ్యాయ
కేంద్రీకృతంగా ఉంటోంది. తరగతి గదిలో నిశ్శబ్దం చోటుచేసుకుంటోంది.
ఫలితంగా పిల్లల్లో సృజనాత్మకత, సమయస్ఫూర్తి, చొరవ, భావవ్యక్తీకరణ
మందగిస్తున్నాయి. తల్లిభాషలో చదవడం, రాయడం వంటి నైపుణ్యాల్ని
పెంపొందించాలి. మాతృభాషలో విద్యాబోధన సాగితే, ఉపాధ్యాయులకు పనిభారం
తగ్గుతుంది. వారు తమ విద్యార్థుల నైపుణ్యాల్ని వెలికితీసేందుకు మరింత సమయం
కేటాయించగలుగుతారు. తల్లిభాషలో విద్యాబోధన విద్యార్థిని ఉద్దేశించి
ఉంటుంది. వారిలో అభ్యాసన నైపుణ్యాలు పెరుగుతాయి. విద్యార్థులకు మానసిక
ఒత్తిడి లేకుండా, ఉపాధ్యాయులు సులభ పద్ధతిలో బోధన చేయగలుగుతారు.
విద్యార్థులూ తదుపరి పాఠాలకు, తరగతులకు సంసిద్ధులవుతారు. పిల్లలకు
విషయ పరిజ్ఞానం, వారి మానసిక పరిణతి తల్లిభాషలో బోధనతోనే సాధ్యపడతాయి.
తల్లిభాషలో జ్ఞానాన్ని సంపాదించి, దాన్ని వేరే భాషలోకి మార్పు చేసుకోవడమే
అత్యుత్తమ మార్గం. ఆ బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ఆంగ్లభాష నుంచి పలు
ప్రామాణిక గ్రంథాల్ని వ్యావహారిక మాతృభాషలోకి తర్జుమా
చేయాలి. ఎందుకంటే- అటు ఆంగ్లం రాక, ఇటు తల్లిభాష చదవలేక నలిగిపోతున్న
పిల్లలు లక్షల్లో ఉన్నారు.
ఆంగ్లభాషా
గ్రంథాల్ని భారతీయ భాషల్లోకి అనువదించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలదే.
అడపాదడపా ఆయా విభాగాలు నిర్వహిస్తున్న అనువాద కార్యక్రమాలు సరైన ఫలితాల్ని
ఇవ్వడం లేదు.
మాతృభాషలో ఉపాధ్యాయ విద్యకు సరికొత్త ప్రణాళికల్ని ప్రభుత్వాలు సిద్ధం
చేయాలి. విశ్వవిద్యాలయాల్లోని నిపుణులైన ఆచార్యులతో సంఘాన్ని ఏర్పాటుచేసి,
మాతృభాషలో బోధనకు అవసరమైన సూచనల్ని ఆహ్వానించి స్వీకరించాలి.
సాధ్యమైనంతవరకు మాధ్యమిక, ఇంటర్ విద్యనూ తల్లిభాషలోనే కొనసాగించాలి.
ఆ జ్ఞానాన్ని తదుపరి విద్యలో వేరే భాషలోకి మార్చుకొనే విధానం వల్ల కూడా
మంచి ఫలితాలు వస్తాయి. త్రిభాషా సూత్రాన్ని అనుసరిస్తూనే, మాతృభాషను
కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారిపై ఉంది!
- డాక్టర్ గుజ్జు చెన్నారెడ్డి
(ఈనాడు సౌజన్యంతో )