Saturday, June 25, 2011

30 మందికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు

వివిధ రంగాల్లో ఉత్తమ సేవలను అందించిన 30 మంది ప్రముఖులకు శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2010 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. అంబల్ల జనార్దన్‌ (సృజనాత్మక సాహిత్యం), గల్లా చలపతి (పరిశోధన), ఎం.వి.నరసింహారెడ్డి (హాస్యరచన), మేడిశెట్టి తిరుమల కుమార్‌ (జీవితచరిత్ర), జూపాక సుభద్ర, జయప్రదా సోమిరెడ్డి (రచయిత్రి), రాజ్యం (నటి), వనం శంకరయ్య (నటుడు), ఇసుకపల్లి మోహనరావు (నాటక రచయిత), కృష్ణయ్య (హేతువాద ప్రచారం), గూడ అంజయ్య (గేయ కవిత), ఏల్చూరి వెంకట్రావు (వివిధ ప్రక్రియలు), పాపయ్య శాస్త్రి (పత్రికారచన), ధూళిపాళ మహాదేవమణి (అవధానం), పి.చిరంజీవినికుమారి (మహిళాభ్యుదయం), రాళ్లపల్లి వేణుగోపాలరావు (గ్రంథాలయకర్త), ఆచార్య జి.సుజాత (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), తల్లావఝుల పతంజలి శాస్త్రి (కథ), నూతలపాటి సాంబయ్య (నాటకరంగం), డా|| సి.వి.నరసింహారెడ్డి (సంఘసేవ, వ్యక్తిత్వ వికాసం), ఎస్‌.రమాజగన్నాథ్‌ (ఆంధ్రనాట్యం), వి.చంద్రశేఖరరావు (నవల), కె.ఎస్‌.బి.వి.కె.శివరావు (భాషాచ్ఛంద సాహిత్య విమర్శ), జంగిరెడ్డి (జానపద కళలు), పెద్దమఠం రాచవీరదేవర (ఆధ్యాత్మిక సాహిత్యం), ఆచార్య బస్న ఐలయ్య (సాహిత్య విమర్శ), మువ్వ వృషాధ్రిపతి (పద్యం), గుదిబండి వెంకటరెడ్డి (సాంస్కృతిక సంస్థ నిర్వహణ), కె.బి.గోపాలం (జనరంజక విజ్ఞానం), పి.వి.చలపతిరావు (జానపద గాయకులు)లను ఎంపిక చేశారు. వచ్చే నెల మొదటి వారంలో తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. రూ. 1116 నగదు, పురస్కార పత్రంతో సత్కరిస్తారు.
గొల్లపూడికి తానా సాహితీ పురస్కారం
 ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సాహితీ పురస్కారాన్ని ప్రకటించింది. జులై 1 నుంచి శాంతాక్లారాలో జరగనున్న తానా 18వ మహాసభల్లో గొల్లపూడికిఅవార్డును ప్రదానం చేయనున్నట్లు సంఘం అధ్యక్షుడు కోమటి జయరాంశుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదు దశాబ్దాలుగా తెలుగు సాహితీ లోకానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా గొల్లపూడికి అవార్డును ప్రకటించినట్లు చెప్పారు. మహాసభలకు మురళీమోహన్‌, పరుచూరి గోపాలకృష్ణ, కె.విశ్వనాథ్‌, బాలకృష్ణ తదితరులు హాజరు కానున్నట్లుపేర్కొన్నారు.