Tuesday, August 30, 2011

మైదుకూరులో ఘనంగా తెలుగు భాషాదినొత్సవం!

కడప జిల్లా మైదుకూరులో తెలుగుభాషా దినోత్సవం ఘనంగా జరిగింది . మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత   పాఠశాల ఆవరణంలో తెలుగు భాషాభిమానులు , ఉపాధ్యాయులూ ,విద్యార్థుల మధ్య సమక్షం లో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష ఉనికికి విఘాతం కల్గిస్తున్న పరిస్థితులను సభికులకు వివరించారు. ప్రపంచం లో అంతరించిపోనున్న అనేక భాషల వివరాలను ఓబుల్ రెడ్డి వివరిస్తూ అండమాన్ దీవుల్లో " బో " అనే భాష ఇటీవల అంతరించిన ఉదంతాన్ని ఉదహరించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గిడుగు రామ మూర్తి పంతులుకు నివాళి అర్పించారు. డాక్టర్ సామల రమేష్ బాబు నాయకత్వం లో ముందుకు సాగుతున్న తెలుగు భాషోద్యమ వివరాలను ఓబుల్ రెడ్డి ఈ సందర్భంగా సభికులకు తెలిపారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్నసాహితీవేత్త జింకా సుబ్రమణ్యం మా ట్లాడుతూ విద్యార్థులు శతక సాహిత్యన్ని ఔపోసన పడితే తెలుగు భాషపై పట్టు పెరుగుతుందని సూచించారు.  తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తనకు సత్కారం చేసినందులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తనకు సత్కారం చేసినందులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కస్తుర్బా విద్యాలయం   విశ్రాంత ప్రిన్సిపాల్  మిరియాల వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా సౌరభమంతా ప్రాచీన తెలుగు సాహిత్యం లో దాగుందని పద్యసహితంగా పేర్కొన్నారు. పద్య కవి లెక్కల వెంకట రెడ్డి మాట్లాడుతూ అచ్చతెలుగులో ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే  వారిని చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ అధ్యక్షుడు ఎ . వీరస్వామి , బాల సాహిత్య రచయిత టి. మహానందప్ప, అధ్యక్షుడు ఎ . వీరస్వామి , యువకవి కృష్ణమూర్తి యాదవ్ , గేయ రచయిత ఖాజహుస్సైన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రముఖుల చిత్రాలు జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన తెలుగు భాషాభిమానులను , విద్యార్థులను ఆకట్టుకుంది.

Monday, August 29, 2011

మా తెలుగు తల్లికి మల్లె పూదండ !

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!


తెలుగువారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు ! 

అమెరికాలో తెలుగు భాషా శిక్షణకు పెరుగుతున్న ఆదరణ

మెరికాలోని ప్రవాసాంధ్రుల కుటుంబాలకు చెందిన పిల్లలు తెలుగు భాష మాధుర్యాన్ని అనుభవించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న హిందూ దేవాలయాల్లో శని, ఆది వారాల్లో తెలుగు భాష నేర్పడం కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులుకు మంచి ఆదరణ లభిస్తోంది. 2008లో 'సిలికానాంధ్ర' సంస్థ చేపట్టిన మనబడి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోంది. తొలుత కాలిఫోర్నియా రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లో తెలుగు నేర్పే 'మనబడి' పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో ఈ తరహా పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో ఓనమాలు నుంచి వ్యాకరణం వరకు భాషపై పూర్తి అవగాహన కల్పించేందుకు నాలుగేళ్ల కోర్సు ఒకటి రూపొందించారు. ఈ కోర్సు నిర్వహణకు హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం సహకారం అందిస్తోంది. కోర్సు పూర్తిచేసిన వారికి ధ్రువపత్రాలు అందిస్తున్నారు.
వర్సిటీల్లోనూ తెలుగు వెలుగు: అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తప్పనిసరిగా ఓ విదేశీ భాష నేర్చుకోవాలి. దీనికి సంబంధించి ధ్రువపత్రం పొందాలి. దీన్ని గుర్తించిన ప్రవాసాంధ్ర ప్రముఖులు తొలిసారిగా 'విస్కాన్సిన్‌' విశ్వవిద్యాలయంలో తెలుగు కోర్సును ప్రవేశపెట్టేలా కృషి చేశారు. టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో అందిస్తున్న తెలుగు భాషలో శిక్షణకూ మంచి స్పందన లభిస్తోంది. ఐదేళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు లక్ష డాలర్లను 'తానా' ఈ వర్సిటీకి విరాళంగా అందజేస్తోంది. ప్రవాసాంధ్ర పిల్లలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు వారి మాటలు అర్థంకాక ఇక్కడి బంధువులు ఇబ్బందిపడేవారు. ఇకపై ఈ సమస్య తప్పనుంది.
-ఈనాడు   

Sunday, August 28, 2011

ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం: 'శిష్ట వ్యవహారిక' రూప శిల్పి " గిడుగు " జయంతి

హైదరాబాద్: గిడుగు రామ్మూర్తి పంతులు 148వ జయంతిని రాష్ట్ర ప్రజలు మాతృభాషా దినోత్సవంగా సోమవారం జరుపుకోనున్నారు. శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు. 1875లో తండ్రి మరణించేవరకూ పర్వతాల పేటలో చదువుకున్న రామమూర్తి ఆ తరువాత విశాఖలోని తన మేనమామ ఇంటికి చేరుకున్నారు. అక్కడ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ముఖలింగ దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకున్నారు. 1879లో మెట్రిక్యులేషన్ పాసయిన తరువాత టీచరుగా పని చేస్తూ, చదువు కొనసాగించారు. 1886లో ఎఫ్.ఎను, 1896లో బి.ఎను డిస్టింక్షన్‌లో పూర్తి చేశారు. గజపతి మహారాజు స్కూలు కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. తెలుగు భాషా బోధనను వ్యావహారికంలో చేయాలన్న ఆయన ఆలోచనకు 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయుడి నుంచి మద్దతు లభించింది. అప్పటి ఏ వీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుటా ్టరు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం 'తెలుగు' అనే పత్రికను గిడుగు ప్రా రంభించారు. వీరి కృషి కారణంగా 19 12-13లో స్కూల్ ఫైనల్ బోర్డు తె లుగు వ్యాస పరీక్షను గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. అప్ప టి నుంచి స్కూలు, కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో వెలువడడం మొదలుపెట్టాయి. ఆ తరువాత ప్రభుత్వం వేసిన ఒ క కమిటీలో గ్రాంథిక వాదులు ఆధిపత్యంతో వ్యావహారిక భా ష లో బోధనను రద్దు చేసినా అనంతర కాలంలో పున రు ద్ధరించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆ యన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉత్తరాంధ్ర అడవుల్లో సవరులు అనే తెగ భా షను నేర్చుకుని అందులో వారికి బోధించారు. దీంతో మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదునివ్వగా ఆ తరువాత కైజర్ ఈ హింద్ బిరుదు ఆయనకు లభించింది. వ్యావహారిక భాషకు ఇంత సేవ చేసిన గిడుగు రామమూర్తి 1940, జనవరి 22న మరణించారు.
-తెలుగు సాహిత్య వేదిక  
 

సెప్టెంబరులో అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం

మచిలీపట్నం: ఆధునిక సాంకేతిక తోడ్పాటుతో మన తెలుగు భాషను విశ్వవాప్తం చేసే దిశగా కృషి సాగుతోందని సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిబొట్ల ఆనంద్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ తెలుగు భాషా వినియోగంలో ఆధునిక ఉపకరణాల తోడ్పాటు అంశమై సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్‌వ్యాలీలో అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.

మాతృభాషను మరవొద్దు - మంత్రి గల్లా అరుణకుమారి


కోయంబత్తూరు: ఇతరుల భాషలను గౌరవించి వారితో వారిభాషలోనే మాట్లాడే గొప్ప సంప్రదాయం తెలుగువారిది. దీని కోసం పరభాషలను నేర్చుకుంటున్నారు. వారి భాషను నేర్చుకుని వారి సంస్కృతిలో భాగమవుతున్నారు. కానీ ఈ తరుణంలో మాతృభాషను మరుస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇతర భాషల్లోనూ ప్రావీణ్యం సాధించడం తప్పనిసరి. దీనిని నేను వ్యతిరేకించను. కాని మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లోనూ మరువరాదని ఆమె తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు సమాఖ్య(డబ్ల్యుటీఎఫ్‌) ప్రాంతీయ సమావేశం శనివారం కోయంబత్తూరులోని రామక్రిష్ణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అరుణ కుమారి మాట్లాడుతూ.. ప్రముఖ స్థానాల్లో ఉన్నవారు తెలుగు రాష్ట్రాన్ని మరువద్దని, ముఖ్యంగా వారి సొంత గ్రామాలకు సేవా కార్యక్రమాలను అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. గత 20 రోజుల నుంచి దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తనకు భయమేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ న్యాయమూర్తి జస్టీస్‌ జి.రఘురాం తీవ్ర అసంతృప్తితో పేర్కొన్నారు. యార్లగడ్డ ప్రభావతి స్మారక పురస్కారాన్ని ప్రముఖ బుల్లితెర, వెండితెర దర్శకురాలు మంజులా నాయుడు అందుకున్నారు

'తెలుగు ఇంటర్నెట్‌' కమిటీ సభ్యుడిగా యార్లగడ్డ



న్యూఢిల్లీ: రాష్ట్ర హిందీ అకాడమీ ఛైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఇంటర్నెట్‌లో తెలుగు వాడకం పురోగతిపై ఏర్పాటుచేసిన కమిటీలో తొమ్మిదో సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు శనివారమిక్కడ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఐటీ విభాగం ఓ ఉత్తర్వు జారీ చేసింది.

Friday, August 26, 2011

తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!

తెలుగు బాట
 తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!
★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★
హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.

	తెలుగు బాటకి నేను వెళ్తున్నాను!

Thursday, August 25, 2011

సింగపూర్‌ తెలుగు సమాజం నూతన కార్యవర్గం ఎన్నిక

సింగపూర్‌: సింగపూర్‌ తెలుగు సమాజం 2011-13కి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆగస్టు 7వ తేదీ కార్యనిర్వాహక కమిటీ సమావేశమై ఈ ఎన్నిక చేపట్టారు. అధ్యక్షడుగా జవహర్‌ చౌదరి యడ్లపల్లిని ఎన్నికవగా, ఉమారావు తెలిదేవర, దుర్గాప్రసాద్‌ కేసాని, శంకర్‌ వీర, కే.ఆర్‌. భాస్కర చౌదరిను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. బంగారు రాజు పేరించర్ల గౌరవ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

Tuesday, August 16, 2011

తేనెలొలికిన ‘తెలుగు’ రచయితల సభలు

సాంస్కృతిక శాఖ, హిందీ అకాడమీ, భారతీయ భాషా కేంద్రం (మైసూర్), సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) సౌజన్యంతో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాలు కవులు, రచయితల్లో భాషా స్ఫూర్తిని నింపాయి. బెంజిసర్కిల్ వద్ద ఉన్న ఎస్వీఎస్ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమాల ముగింపు సభకు హైకోర్టు న్యాయమూర్తి గ్రంధి భవానీప్రసాద్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ సారథ్యంలో రెండో మహాసభలు కూడా విజయవాడలోనే జరగడం విశేషమన్నారు. లోక్‌సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ తాను భాషా ప్రియుడినన్నారు. ఫ్రెంచ్, బెల్జియంలో రెండు భాషలు ఉన్న కారణంగా ప్రభుత్వం ఏర్పడలేదన్నారు. బెంగాలీ, పంజాబీ భాషల కారణంగా పాకిస్తాన్ విడిపోయిందన్నారు. భాషను విద్యా అంశంగా తీసుకోవాలని ఆయన సూచించారు. హెచ్‌ఎం టీవీ సీఈవో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ పత్రికల ద్వారా భాషా సేవచేసే అవకాశం ఉందన్నారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్ కల్లూరి భాస్కరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రభ సంపాదకుడు విజయబాబు మాట్లాడుతూ అతి తక్కువ వయసున్న భాష ఇంగ్లిష్ అన్నారు. దానిని అంటరానిదానిగా, పరాయి భాషగా చూడాల్సిన అవసరం లేదన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ తెలుగును ఆధునిక భాషగా గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఎమెస్కో ప్రచురణ సంస్థ అధినేత విజయకుమార్ మాట్లాడుతూ రచనలు సార్వజనీన స్థాయికి చేరుకుంటే పత్రికలు, ప్రచురణ సంస్థలు ముద్రించడానికి అవకాశముందన్నారు.ప్రముఖ హిందీ, బెంగాలీ రచయిత ప్రొఫెసర్ ఇంద్రనాథ్‌చౌదరి మాట్లాడుతూ ప్రాథమిక విద్య పూర్తిగా తెలుగు భాషలో ఉన్నపుడే పిల్లలు అర్థం చేసుకోవడానికి అవకాశముంటుందన్నారు. విశ్వనాథ, గురజాడ, శ్రీశ్రీ లాంటివారు మళ్లీ పుట్టాలని ఆకాంక్షించారు. హిందీ నవలా రచయిత్రి ప్రతిభారాయ్ మాట్లాడుతూ భాషాభివృద్ధిపైనే ఆయా దేశాల అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ తుర్లపాటి కుటుంబరావు, ప్రచురణకర్త ఇమ్మిడిశెట్టి రామ్‌కుమార్, ప్రొఫెసర్ ఉషాచౌదరి, సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత ఎంవీఎస్‌ఆర్ పున్నంరాజు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, చిగురుపాటి వరప్రసాద్, హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.సుబ్బారావు, జీవీ పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు.

‘సమాజాన్ని సమైక్యపరిచే తెలుగు’
సమాజాన్ని సమైక్య పరిచే శక్తి భాషా సంస్కృతులకే ఉందని రచయితల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మహాసభల్లో భాగంగా సోమవారం ఎస్వీఎస్ కల్యాణ మండపంలో ‘జాతీయతా భావం-రచయితల పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకోత్తర, మహత్తర త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ నేటి తరానికి తెలుగు మాట్లాడడమేగానీ చదవడం, రాయడం రావట్లేదన్నారు.

కలకత్తాకు చెందిన సంస్కృతాచార్యులు ఆచార్య ఉషాచౌదరి మాట్లాడుతూ జాతీయ భావాలకు, పరమత సహనం, వారసత్వానికి ఆది నుంచి భారతదేశం పెట్టింది పేరన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నల్లవారి హక్కుల కోసం పోరాడి తెల్లవారి తుపాకులకు బలైన మార్టిన్ లూధర్ కింగ్ ఇంట్లో మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న చరిత్ర భారతదేశానిదన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు హర్షవర్థన్ మాట్లాడుతూ ఏ భాషనైనా కాలానుగుణంగా మార్చుకున్నప్పుడే మనుగడ సాధ్యమవుతుందని, మాతృభాష మృతభాషగా మారకుండా ఉంటుందన్నారు. సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించిన సిలికాన్ ఆంధ్రా కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తెలుగు భాషను ప్రపంచ భాషగా గుర్తింపు తెచ్చేందుకు కృషిచేద్దామన్నారు. కృష్ణా యూనివర్సిటీ మాజీ ఉపకులపతి మైనేని కేశవదుర్గాప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషను ఆధునికీకరించపోతే మనుగడ ఉండదన్నారు.అనంతరం తెలుగులో అంతర్జాల అన్వేషణ, ముద్రణారంగంలో సాంకేతిక తోడ్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అలాగే ఇ-పుస్తకాల గురించి వెంకట్రామ్, వికీపీడియా గురించి చావా కిరణ్, లిపి ఎలా రూపుదిద్దుకుంటుందో శివరావ్ వివరించారు. సీపీ బ్రౌన్ వేదికపై జరిగిన ఈ సదస్సులో తెలుగు ఫాంట్ అభివృద్ధి కమిటీ సభ్యుడు అమర్‌నాథ్‌రెడ్డి, ఆచార్య జి.ఉమామహేశ్వరరావు, డి.అంబరీష్, వి.వెంకటరమణ, కళాసాగర్, కొత్తపల్లి నారాయణస్వామి, పెద్ది సాంబశివరావు, సలాక రఘునాథశర్మ, రహిమానుద్దీన్, కె.వీరభద్రశాస్త్రి పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. ఆ వివరాలు.. 
* పల్లె నుంచి నగరాల వరకు అంతా తెలుగే మాట్లాడాలి. ఇంట్లో, బయట అమ్మ భాషే మాట్లాడాలి.
* రాష్ట్రంలో తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను వెంటనే ఏర్పాటు చేయాలని, దీనివల్ల భాషా సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి.
* రెండేళ్లుగా అధికార భాషా సంఘ కార్యవర్గాన్ని నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం విచారకరం. వెంటనే నియామకాలు జరపాలి.
* ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ'ని పునరుద్ధరించాలి.
* ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగులో బోధన తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల నెంబరు 86 విడుదల చేసినా దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని సమావేశాలు తప్పుపట్టాయి. (ఈ ఉత్తర్వు విడుదలయిన మూడు సంవత్సరాల తరువాత తమిళమాధ్యమంపై అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.) తెలుగు బోధించని ప్రభుత్వేతర పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి. గ్రామ స్థాయి నుంచి తెలుగు బోధన కోసం ఉద్యమాలు చేపట్టాలి.
* వచ్చే 'నందన'నామ సంవత్సరాన్ని తెలుగు భాషా సంస్కృతుల సంవత్సరంగా ప్రకటించి గ్రామస్థాయి నుంచి తెలుగుపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి.
* పాలన, బోధన భాషగా తెలుగు అమలుపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి.
* తెలుగు మాట్లాడే విద్యార్థులపై చర్యలు తీసుకునే విద్యా సంస్థలు ఉంటే నిరసనలు, ఆందోళనలు చేయాలి.
* తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ప్రోత్సాహంగా ఉద్యోగాల మౌఖిక పరీక్షల్లో అయిదు మార్కులు అదనంగా కేటాయించాలి

Sunday, August 14, 2011

తెలుగుకు మళ్లీ వెలుగు- 'ఈనాడు' సంపాదకులు రామోజీరావు

తల్లిపాల మాధుర్యాన్ని తలపించేదే అమ్మభాష. అలాంటి మన తెలుగు, నేడు ఆంగ్ల ప్రభావంవల్ల చిక్కిశల్యమైపోతోంది. తెలుగు భాషావికాసోద్యమం మళ్ళీ మొదలైతే తప్ప, పరిస్థితి చక్కబడదు. విజయవాడలో నిన్న ప్రారంభమైన 'ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభ'లో పాల్గొన్న వక్తల ప్రసంగాల సారాంశమిదే. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 'ఈనాడు' సంపాదకులు రామోజీరావు- భాషోద్ధరణ పాఠశాలనుంచి మొదలుకావాలన్నారు. వాడుకే భాషకు వేడుక అవుతుందని స్పష్టంచేశారు. తెలుగు భాష పునరుజ్జీవానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ కృషికి 'తెలుగు రచయితల మహాసభ' నాంది పలకాలన్నారు. రామోజీరావు ప్రసంగం పూర్తిపాఠమిది...

 " మాతృభాష మీద మమకారంతో, ప్రేమతో మీరందరూ ఎంతో దూరాలనుంచి వచ్చారు. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇదొక బృహత్‌ యజ్ఞం. దీన్ని నిర్వహిస్తున్న కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అమ్మభాష గురించి మాట్లాడటం అంటే తల్లిపాల మాధుర్యాన్ని తనివితీరా మననం చేసుకోవడమే. తెలుగు గడ్డపై పుట్టడం ఎన్నో జన్మల తపోఫలమని కొందరు మహాత్ములన్నారు. అంతెందుకు- జాతీయభాష కాగల అర్హత తెలుగుకు మాత్రమే ఉందని జేబీ హేల్డెన్‌ లాంటి విదేశీయుడే మెచ్చుకున్నాడు. తెలుగు ఒక భాష మాత్రమే కాదు. ఒక సంస్కృతి... ఒక సంప్రదాయం... ఒక జీవన విధానం. ఆ మాటకొస్తే, ఏ జాతికైనా చైతన్యం కలిగించేది భాషే. ఒక జాతి ప్రజల కట్టుబాటును మతంకన్నా భాషే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. బంగ్లాదేశ్‌ అనుభవమే ఇందుకు ఉదాహరణ. భాషను, సంస్కృతిని నిలబెట్టుకుంటేనే తెలుగుజాతి కలకాలం వర్ధిల్లుతుంది. నిజానికి మన భాషకేం తక్కువ? దేశంలో హిందీ తరవాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే. అయితే... ఆంగ్ల ప్రభావంవల్ల మన భాష చిక్కి శల్యమైపోతోంది. మన ఆలోచనల్లో, ఆచార వ్యవహారాల్లో తెలుగుదనం కరిగిపోతోంది... తరిగిపోతోంది. ఇందువల్ల మన సంస్కృతి, సంప్రదాయం, మానవ సంబంధాలు... అన్నీ దెబ్బతింటున్నాయి. రానురాను తెలుగుదనం ఉనికే పోతుందా అన్న భయం కలుగుతోంది. 30శాతం ప్రజలకు సొంత భాష చదవడం, రాయడం రాకపోతే ఆ భాష అంతరించిపోతుందని యునెస్కో చెప్పింది. ఈ కష్టం... ఈ నష్టం తెలుగుకు రాకూడదు. ఈ బాధ్యత మన భుజస్కంధాలమీద ఉంది. ఇందుకు ఎవరికి వాళ్లు ముందుకు రావాలి. మనరాష్ట్రంలో పిల్లల్ని గమనించండి... ఆంగ్లపదం రాకుండా ఒక్క నిమిషం కూడా తెలుగులో మాట్లాడలేరు. కారణాలేమైనా చక్కటి తెలుగు రాయడం, మాట్లాడటం, చదవటం అపురూపమైపోతోంది.
వాడుక... భాషకు వేడుక
ఏదైనా మాతృభాషలో నేర్చుకుంటేనే పిల్లలకు బాగా ఒంటపడుతుంది. అది తెలిసినా తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోతున్నారు. అది వాళ్ల తప్పు కాదు. ఎవరికైనా పిల్లల భవిష్యత్తే ముఖ్యం కదా? పిల్లల చదువుసంధ్యలు, వాళ్ల భవిష్యత్తు ఒకపక్క- మాతృభాష అయిన తెలుగు భవిష్యత్తు ఒకపక్క. ఈ రెండూ ఒకదాంతో ఒకటి ముడివడి ఉన్నాయి. తెలుగు భాషమీద మొహంమొత్తి ఇంగ్లిషు వ్యామోహం పెరిగిందా అంటే, అదీ కాదు. ఏ భాషకైనా తప్పకుండా బహుముఖ ప్రయోజనం ఉండాలి. మొదటిది... చెప్పిన మాట ఎదుటివారికి స్పష్టంగా అర్థం కావాలి. ఇది సామాజిక ప్రయోజనం. భాష ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడాలి. ఇది ఆర్థిక ప్రయోజనం. ఈ ప్రయోజనాలు నెరవేర్చినప్పుడే భాష రోజువారీ వ్యవహారంలో ఉంటుంది. భాషా సంస్కృతులు బాగున్న జాతి జీవకళతో ఉప్పొంగుతుంటుంది. ఇది ఎక్కడి విషయమో కాదు... మన ఇరుగు పొరుగును చూడండి. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీలు ఉన్నారు కదా! భాషా సంస్కృతుల్ని ప్రాణంగా చూసుకుంటారు. వాటిని ఆత్మగౌరవ చిహ్నాలుగా చేసుకున్నారు. రేడియో, టీవీ, సెల్‌ఫోన్‌ వంటి ఇంగ్లిషు మాటల్ని కూడా వెంటనే తమిళ భాషలోకి అనువాదం చేసుకున్నారు. చివరికి డెంగీ, స్వైన్‌ ఫ్లూ లాంటి కొత్త వ్యాధులకూ తమిళ పేర్లున్నాయి. ఎక్కడో తప్ప ఆంగ్ల పదజాలానికి వారు దాసోహం కాలేదు. తమిళుల ధోరణి మిగతా భాషల వారందరికీ ఆదర్శం. ఒకటినుంచి పదో తరగతి దాకా ప్రతి విద్యార్థీ తమిళం నేర్చుకోవాలని అక్కడ నిబంధన పెట్టారు. తమిళంలో చదివినవారికే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలిస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమిళ భాషపై పరిశోధనలను బాగా ప్రోత్సహిస్తుంది. ఎప్పటికప్పుడు ఆంగ్ల పదాలకు తమిళ సమానార్థకాలను రూపొందించడంలో వాళ్లు తలమునకలవుతుంటారు. పొరుగు దేశాల సంగతి తీసుకుందాం... చైనా రెండు భాషల పద్ధతి పాటిస్తుంది. అందువల్ల ఆ దేశ ప్రజలు స్థానిక సంస్కృతిని, సంప్రదాయాన్ని, అస్తిత్వాన్నీ ఏ మాత్రం పోగొట్టుకోకుండానే అంతర్జాతీయ స్థాయిని అందుకుంటున్నారు. సమకాలీన పరిస్థితులనుబట్టి అక్కడి పాఠశాలల్లో బోధించే మాతృభాషను నిత్యనూతనంగా మలచుకుంటున్నారు. ఫ్రెంచ్‌ ప్రభుత్వమూ ఇలాంటి కృషే చేస్తోంది. మరి అలాంటి భాషాచైతన్యం, కట్టుబాట్లు మనకెందుకు లేవు? మనరాష్ట్రంలో అధికార భాష తెలుగు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తరప్రత్యురాలు... అన్నీ తెలుగులో ఉండాలన్న నిబంధనలకు లోటు లేదు. అయితేనేం... రాజ్యమేలుతున్నది ఇంగ్లిషే!
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంగా మన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పారు... ప్రతి రాష్ట్రానికి మాతృభాషే అధికార భాషగా ఉండాలని... పరిపాలన వ్యవహారాలన్నీ మాతృభాషలోనే జరగాలని. ఇప్పటికి అయిదున్నర దశాబ్దాలైంది. ఆంధ్రప్రదేశ్‌ ఆంగ్లప్రదేశ్‌ అయింది తప్ప- తెలుగు వాడకం పెరగలేదు. ఇతరులను చూసి నేర్చుకోవడం కూడా మనకు కరవైపోయింది. అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది రోజుకు ఎనిమిది గంటల చొప్పున, ఎనిమిది నెలలపాటు కష్టపడి తెలుగు నేర్చుకున్నారట. మరి మనమో? తెలుగులో మాట్లాడటం, రాయడం నామోషీ అనుకుంటున్నాం. భాషా ప్రేమికులైన ఒకరిద్దరు అధికారులో, న్యాయమూర్తులో తెలుగులో ఉత్తర్వులు జారీచేస్తే దాన్నే గొప్పగా చెప్పుకొంటున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలుగు భాషా వికాసోద్యమం మళ్లీ మొదలు కావాలి. ఇందుకు రెండు రకాల ప్రయత్నాలు సాగాలి. తెలుగువల్ల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలుండేట్టుగా ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకోవాలి. తెలుగు వస్తేనే తమ బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులకు నమ్మకం కలగాలి. అప్పుడే తమ పిల్లలు తెలుగు నేర్చుకోవడంమీద వాళ్లు సుముఖత చూపిస్తారు. సమాజం పెరిగేకొద్దీ భాష పెరుగుతుంది. విజ్ఞానం పెరిగేకొద్దీ భాష విస్తరిస్తుంది. ఈ క్రమంలో తెలుగు కూడా ఆంగ్లంతో పోటీపడి పెరగాలి. మనం వెనకబడితే భాష కూడా వెనకబడుతుంది. ఇంగ్లిషు మీద విముఖత అక్కర్లేదు. తెలుగు పట్ల సుముఖతను పెంచుకోవాలి. తెలుగులోనే మాట్లాడటం, చదవటం అంటే ఇంగ్లిషుకు వ్యతిరేకం కానే కాదు. ఇది అందరికీ స్పష్టం చెయ్యాలి. మనది అందరి భాష... ఎవరికీ అందని భాష కాకూడదు. ఇందుకు ప్రభుత్వం చెయ్యాల్సినవి కొన్ని... ప్రజలు చెయ్యాల్సినవి ఇంకొన్ని. భాషకు పట్టం కట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇందుకు సమాజంనుంచి ఒత్తిడి రావాలి. భాషోద్ధరణ పాఠశాలనుంచే మొదలు కావాలి. ఒకటో తరగతినుంచి పట్టభద్రస్థాయి దాకా తెలుగు భాషను తప్పనిసరి పాఠ్యాంశంగా చెయ్యాలి. ఇక్కడ మరో విషయం చెప్పాలి... పాఠ్యపుస్తకాల్లో ఉండే తెలుగు- పిల్లల్ని భయపెట్టేలా ఉండకూడదు. తేనెలొలికే తెలుగుమీద వాళ్లకు ఆసక్తి పెంచేట్టుగా ఉండాలి. ఇందుకోసం పాఠ్యపుస్తకాల్లోని పదజాలాన్ని ఇంకా సరళీకరించాలి. ఆంగ్ల పదాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి భాషాప్రియులు నడుం కట్టాలి. మన వ్యవహారంలోకి వచ్చిపడుతున్న ఆంగ్ల శబ్దాలకు ఎప్పటికప్పుడు తెలుగు మాటలను సృష్టించాలి. అయితే ఒక జాగ్రత్త తీసుకోవాలి. సమానార్థకాలు తయారు చేసేటప్పుడు అవి వినడానికి ఇంపుగా, తేలిగ్గా ఉండాలి. కొరుకుడు పడని పదాలైతే నష్టం వాటిల్లుతుంది. తెలుగు అనగానే ఏ తెలుగు అన్న మీమాంస అనవసరం. యాస భాషకు బలం. లక్షలమంది మాట్లాడే మాండలికాలన్నీ భాషకు ఆయువుపట్టులే. అవన్నీ అవసరమే. అసలు సిసలైంది జనభాషే. మంచి మంచి తెలుగు మాటలను ప్రసార సాధనాల్లోకి తెచ్చుకుంటే భాష అందగిస్తుంది. ఈ క్రతువులో పండితులే కాదు... భాష మీద ప్రేమ, అవగాహన ఉన్న సామాన్యులు కూడా పాలుపంచుకోవాలి. నిజమైన భారతదేశం గ్రామాల్లో ఉందంటారు. నా దృష్టిలో నిజమైన భాష పల్లెపట్టుల్లోనే ఉంటుంది. అక్కడ వాడుకలో ఉన్న పదాలను అందరం వాడుకుందాం. ఆ వాడుక తెలుగు భాషకు వేడుక అవుతుంది. డ్రెడ్జర్‌ అనే మాటకు 'తవ్వోడ' అన్న పదాన్ని సృష్టించింది సామాన్యులే. వారి అవసరార్థం దాన్ని కనిపెట్టారు. డ్రిప్‌ ఇరిగేషన్‌కు చుక్కల సాగు కూడా అలా వచ్చిందే. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ అందరి వాడుకలోకి రావాలి. అప్పుడే మన భాష మరింత శక్తిమంతమవుతుంది.
మరో మహోద్యమం
భాష, సంస్కృతి... రెండూ విడదీయరానివి... ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్నవి. అందుకే పిల్లలకు ఇవన్నీ నేర్పాలి. ఒక్క ఆంగ్ల శబ్దం కూడా రాకుండా తెలుగులో మాట్లాడేలా, రాసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. వక్తృత్వం, వ్యాసరచన, సామెతలు, శతక పద్యాలు, కీర్తనలు వంటివాటిలో పోటీలు పెట్టాలి. విజేతలకు బహుమతులివ్వాలి. పాల్గొన్నవారందరినీ ఏదోరకంగా ప్రోత్సహించాలి. అవకాశం ఉన్నవారు తమ ఇళ్లలో కూడా పిల్లలచేత కసరత్తు చేయించాలి. ప్రోత్సహించాలి. పిల్లల్లో తెలుగు చదవాలన్న ఆసక్తిని, రచనాశక్తిని మనం పెంపొందించాలి. అందమైన తెలుగులో చిన్నారులను ఆకట్టుకునే కథలు, పుస్తకాలు విరివిగా రావాలి. వాటివల్ల భాషమీద, సంస్కృతిమీద మమకారం పెరుగుతుంది. మన భాషాసంస్కృతులు మనకు అమూల్య ఆస్తులు... మన వారసత్వ సంపద. వాటిని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు? ప్రపంచం మొత్తంమీద ఉన్న 12కోట్లమంది తెలుగువారి ఉనికికి సంబంధించిన విషయం ఇది. దీనికి ఎటువంటి ప్రమాదం రాకుండా అడ్డుకుందాం. 1822లో రాజా రామ్మోహన్‌రాయ్‌ సొంత సొమ్ముతో ఒక పాఠశాలను పెట్టారు. అందులో శాస్త్ర సాంకేతిక విషయాలను కూడా బెంగాలీలోనే బోధించే ఏర్పాట్లు చేశారు. ఆ మహానుభావుడే మనకు స్ఫూర్తి కావాలి. ఫ్రెంచ్‌ దేశస్తులు వాళ్ల కళలు, సంస్కృతిని కాపాడుకోవడానికి రెండు శతాబ్దాలపాటు సాంస్కృతిక పునరుజ్జీవన విప్లవం చేశారు. ఇది చరిత్ర. మన దగ్గర కూడా అలా చరిత్ర సృష్టించాలి. 'తెలుగు భాషా పునరుజ్జీవన ఉద్యమం' సాగాలి. ఈ మహాసభలు ఇందుకు నాందీ ప్రస్తావన చెయ్యాలి. భాషాప్రియులుగా మీరున్నారు. మీకు తోడుగా మేమూ ఉన్నాం. తెలుగు భాషా పునర్వికాసానికి కృషి చేసేందుకు ఈనాడులో 'తెలుగు వెలుగు' పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఆంగ్ల పదాలకు ప్రత్యామ్నాయాలు, సమానార్థకాల అన్వేషణ, పద సేకరణ, నూతన పదాల్ని సృష్టించడం, వాటిని వ్యాప్తిలోకి తేవడం... వంటివాటిపై ఈ విభాగం పనిచేస్తుంది. నా ఆకాంక్ష ఒక్కటే... తెలుగు భాష కొత్త పుంతలు తొక్కాలి. అగ్రగామిగా నిలవాలి. తెలుగు సంస్కృతి, వైభవం ఎప్పటికీ జీవనదిలా ప్రవహించాలి. ఇప్పటికే జాప్యం జరిగి ఉండవచ్చు. ఇక కాలయాపన తగదు. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తారని ఆశిస్తూ... సెలవు తీసుకుంటున్నాను "

ఒకే తాటిపైకి గల్ఫ్ దేశాల తెలుగువారు !

ఉన్న ఊర్లో ఉపాధి కరవవడంతో నాలుగురాళ్లను వెనకేసుకోవాలని అయినవారికి దూరంగా గల్ఫ్‌దేశాలకు పయనమయ్యారు.. అలావెళ్లినవారికి అవమానాలు.. ఛీత్కారాలు నిత్యకృత్యమయ్యాయి.. కొందరైతే జైళ్లల్లో మగ్గుతున్నారు.. మరి కొందరు చిన్నపాటి విషయాలకే సేఠ్‌ల చేతులలో ప్రాణాలు కోల్పోతున్నారు.. ప్రమాదంలో చనిపోతే రక్తసంబంధీకులకు చివరి చూపుకూడా దక్కడం లేదు.. వీటన్నింటినీ ఇన్నాళ్లు మౌనంగా భరించారు.. వారిలో చైతన్యం వచ్చింది.. చేయిచేయి కలిపారు.. ఫోరంగా ఏర్పడ్డారు.. తెలుగువారికి ఏ అన్యాయం జరిగినా కలసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు.
  గల్ఫ్ దేశాలలో ఉంటున్న తెలుగువారంతా ఒకేతాటిపైకి వచ్చారు. తమకు జరుగుతున్న అన్యాయాలను సంఘటితంగా ఎదుర్కొవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒక ఫోరంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, బద్వేలు ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వేలాది మంది గల్ఫ్‌దేశాలకు వెళ్లారు.. వెళుతున్నారు. అక్కడికి వెళ్లిన వారు వివిధ రకాలుగా బాధలు పడుతున్నారు..జైళ్లల్లో మగ్గుతున్నారు..షేఠ్ చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు..అన్యాయాలకు..అక్రమాలకు..
 బలవుతున్నారు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే మృతదేహాలను రక్తసంబంధీకులు చూసే భాగ్యంకూడా కొన్ని సందర్భాలలో దక్కటం లేదు. ఒక్క కువైట్‌లోనే నాలుగులక్షల మంది తెలుగువారు నివసిస్తున్నారు. దీంతోపాటు దుబాయ్, ఖతర్, మస్కట్, సౌదీ అరేబియా దేశాలలో మూడు లక్షల మంది ఉన్నట్లు అంచనా.

గల్ఫ్‌దేశాల్లో తెలుగువారిని చిన్నచూపు చూడటం సాధారణమైపోయింది. ఫిలిప్పీన్, శ్రీలంక,ఇరాన్, ఇరాక్, చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్ దేశాలకు చెందిన వారు, అలాగే మన దేశంలోని కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారు ఐక్యంగా తమ వారికి అన్యాయం జరిగితే సమష్టిగా ఆదుకుంటారు. అవసరమైతే తమ దేశ రాయబారి కార్యాలయం నుంచి వత్తిడి తీసుకొస్తారు. అయితే తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలకు స్పందించేవారుగానీ, చేయూత ఇచ్చేవారుగానీ కరువవుతున్నారు. దశాబ్ధాల కాలంలో గల్ఫ్ దేశాలలో తెలుగువారు బాధలు పడుతున్నా పట్టించుకునే నాథుడే ఉండటం లేదు. కనీసం తోటి తెలుగువారు కూడా సహకరించడం లేదు. దీంతో గల్ఫ్ దేశాలలో రోజురోజుకూ తెలుగువారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. చిన్నచిన్న విషయాలకే తెలుగువారు హత్యలకు గురికావడం, ఇతర సంఘటనలతో తొలిసారిగా గల్ఫ్‌దేశాలలో తెలుగుసంఘాలు ఒక్కటిగా నిలవాలని నిర్ణయించాయి. తెలుగువారికి అండగా, చేయూతగా నిలవాలని ఒకేతాటిపైకి వచ్చాయి.
 ఆవిర్భావం ఇలా..
తెలుగువారు పడుతున్న కష్టాలను పరిష్కరించడానికి కువైట్ దేశంలోని అన్ని తెలుగుసంఘాలు ప్రతినిధులు సమావేశమై యునెటైడ్ తెలుగుఫోరం-కువైట్‌గా ఏర్పాటు అయ్యారు. ఈమేరకు శుక్రవారం రాత్రి స్మాలియా ప్రాంతంలో తెలుగుసంఘాల నాయకులు భేటీ అయ్యారు. ఇందులో ఆదర్శ ఆంధ్రాయూత్, తెలుగుకళాసమితి, కళాంజలి, తెలుగులలితకళాసమితి, రాక్‌డ్యాన్స్ అకాడమీ, ప్రవాసాంధ్ర టీడీపీ , ఎన్‌ఆర్‌ఐటీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, మహాత్మాగాంధీవెల్ఫేర్, రియాల్-అరబ్ టు ఏపీ, మయూరి గ్రూప్స్, ప్రవాసాంధ్రకాంగ్రెస్, తెలుగు క్రిష్టియన్ సంఘాలున్నాయి. కోల్లబత్తుల వీర్రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో యడ్ల రవి, యేసురత్నం, దార్ల శ్రీను, త్రిమూర్తులు, ములకల సుబ్బరాయుడు, బలరాంనాయుడు, రాజశేఖర్, రాజేష్, బీపీనాయుడు, మురళీ, భాస్కరరెడ్డి, వెంకటరెడ్డి, వెంకటశివరావు, సత్య పాల్గొన్నారు.
 నిధులు సేకరణకు సమాయత్తం
కువైట్‌లో తెలుగుబాధితులను ఆదుకునేందుకు నిధుల సేకరణకు యునెటైడ్ తెలుగుఫోరం-కువైట్ సమాయత్తమైంది. బాధితులకు త్వరలో ఆర్థిక సహాయం అందచేస్తామని ప్రకటించింది. భారతరాయబారి సతీష్‌చంద్రమోహతాను కలిసి తెలుగువారి సాధకబాధకాలపై వినతిపత్రం సమర్పించారు. ఇటీవల సేఠ్ చేతిలో హత్యకు గురైన గాలివీడుకు చెందిన తోకలనరేష్, అగ్గివారిపల్లెకు చెందిన నల్లగుట్ట రమణయ్య, దుద్వాలకు చెందిన మాసగిరి ఓబులరెడ్డి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

తెలుగువారిని హత్య చేయడం దారుణం
కువైట్‌లో తెలుగువారిని హత్య చేయడందారుణం. వీధిన పడిన గల్ఫ్ బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. మావంతు సహాయాన్ని యునెటైడ్ తెలుగుఫోరమ్ ద్వారా అందిస్తాం
- వీర్రాజు, యునెటైడ్‌ఫోరమ్, ఆర్గనైజర్, కువైట్
 హత్యలు విచారకరం
పొట్టి కూటి కోసం వచ్చిన వారు ఇలా హత్యలకు గురికావడం విచారకరం. తెలుగువారంతా ఒక్కటిగానే ఉండాలి. సమష్టిగా పోరాడాలి. అందుకే యునెటైడ్ ఫోరమ్‌ను బలోపేతం చేయాలి -ఆకులప్రభాకరరెడ్డి, కువైట్
 మానవత్వంతో ఆదుకోవాలి
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వచ్చిన ప్రతి ఒక్కరినీ మానవత్వంతో ఆదుకోవాలి. కువైట్‌లో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటడానికి తెలుగు గొంతులు ఒక్కటికావాలి. - కె.ఈశ్వరబాబు, కువైట్
 ఎట్టకేలకు స్వదేశాలకు మృతదేహాలు
 ఈ నెల 1న కువైట్‌లో వేర్వేరు ప్రాంతాల్లో తుపాకీ తూటాలకు బలైన మూడు మృతదేహాలను స్వదేశాలకు పంపించేందుకు రంగం సిద్ధం చేసినట్లు శనివారం అందిన సమాచారం. ఇందులో వై.ఎస్.ఆర్ జిల్లాలోని గాలివీడు మండలం నాగువారివాండ్లపల్లెకు చెందిన తోకల నరేష్‌కుమార్, చిత్తూరు జిల్లాలోని కంభంవారిపల్లె మండలం ఎంవీపల్లె పంచాయితీ అగ్గివారిపల్లె గ్రామానికి చెందిన నల్లగుట్ట రమణయ్య, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లెలో ఉంటూ సంబేపల్లె మండలం దుద్యాలలో జన్మించిన ఎం.ఓబులరెడ్డి ఉన్నారు. కాగా జిల్లాకు చెందిన తోకల నరేష్‌కుమార్ మృతదేహంను కువైట్‌లో ఈనెల 16న తరలించనున్నట్లు సమాచారం.
 ఈ మృతదేహాలను స్వదేశానికి చేర్చే క్రమంలో చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి ఉచితంగా స్వగ్రామాలను తరలించేలా అంబులెన్స్‌ను ఏర్పాటుచేయాలని, ఎన్‌ఆర్‌ఐసెల్‌తోపాటు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లా కలెక్టర్లను కోరుతూ లేఖ రాసినట్లు వలసదారుల హక్కుల మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీ రెడ్డి శనివారం న్యూస్‌లైన్కు తెలిపారు. నల్లగుంట రమణయ్య, ఓబులరెడ్డి మృతదేహాలు ఆదివారం కువైట్‌లో తరలిస్తారని సోమవారం తెల్లవారుజామున చెన్నై విమానాశ్రయానికి చేరుతాయని స్పష్టంచేశారు. ఈ రెండు మృతదేహాలు వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన నరేష్ మృతదేహం వస్తుందని ఆయన వివరించారు.

ద్వితీయభాషగా కూడా తెలుగును తీసేస్తున్నారు- సినారే ఆవేదన



ప్రైవేటు విద్యాసంస్థల్లో తెలుగు మరీ అన్యాయమైపోతోందని జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ తెలుగును ద్వితీయభాషగా కూడా తీసేస్తుండడం ప్రమాదకరమన్నారు. తెలుగులో రాస్తున్నాడు, మాట్లాడుతున్నాడనే నెపంతో ఒక విద్యార్థిని తరగతి నుంచి బహిష్కరించి, శిక్షించిన దృష్టాంతాన్ని మనం చూశామని, ఇది తెలుగు నాట తెలుగుకు జరుగుతున్న తీరని అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీల్లో ఆంగ్ల పదాల ఉపయోగం ఎక్కువగా ఉందన్నారు. ఒక 'ఈటీవీ'లోనే తెలుగు ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటూ 'స్వల్పవిరామం' అనే పదాన్ని ఉదహరించారు. ఇతర భాషా పండితులు కూడా తెలుగు ప్రాశస్త్యాన్ని, ఔచిత్యాన్ని కొనియాడారని సినారె గుర్తుచేశారు. తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
వాడుక భాషే తెలుగు భాషకు వేడుక అవుతుందని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అన్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభలకు రామోజీరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ''నిజమైన భాష పల్లె పట్టుల్లోనే ఉంటుంది. అక్కడ వాడుకలో ఉన్న పదాలను అందరం ఉపయోగిద్దాం. ఆ వాడుకే తెలుగుకు వేడుక అవుతుంది'' అని ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగు అంటే ఏ తెలుగు అనే మీమాంస అనవసరమని, భాషకు యాస బలమని, లక్షల మంది మాట్లాడే మాండలికాలన్నీ భాషకు ఆయువుపట్టులే, అన్నీ అవసరమే అని స్పష్టం చేశారు. పాఠశాల స్థాయి నుంచే భాషోద్ధరణ మొదలు కావాలని ఆకాంక్షించారు. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీల భాషాభిమానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. భాషా ప్రియులకు తోడుగా 'ఈనాడు' ఉందని, నిర్దిష్ట ప్రణాళికతో ముందడుగు వేయాలని సూచించారు.
తీరికలేని ప్రభుత్వం: యార్లగడ్డ
తెలుగు గురించి పట్టించుకునే తీరిక మన పాలకులకు లేకుండా పోయిందని మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అధికార భాషా సంఘానికి ఏడాదిగా సమితి లేక ఖాళీగా ఉందన్నారు. చివరకు తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వచ్చే తీరిక కూడా పాలకులకు లేకుండా పోయిందని అన్నారు. ప్రతి పాఠశాలలోనూ మన బిడ్డలకు తెలుగు తప్పకుండా నేర్పించాలంటూ ప్రభుత్వాలను, పాఠశాలల యాజమాన్యాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. సభ గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు భాష ఇప్పుడు దారులు మూసుకు పోయిన కూడలిలో దిక్కుతోచని స్థితిలో దీనంగా నిలబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలు సమగ్ర భాషా చైతన్యానికి పూనుకోకుంటే చరిత్ర మనల్ని క్షమించదనే ఆవేదనతోనే ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు. టీవీలు వచ్చాక పల్లెటూర్లలో కూడా తెలుగు భాష ఆంగ్లపదాలతో కలుషితమైపోయిందని ప్రముఖ కథా రచయిత, కథానిలయం వ్యవస్థాపకుడు కాళీపట్నం రామారావు అన్నారు. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్‌ మాట్లాడుతూ తెలుగు భాషపై అభిమానం ఉన్న పీవీ నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, ఎన్టీఆర్‌ లాంటి నేతలు ఇప్పుడు మనకు అవసరమన్నారు. ఇప్పుడున్న పాలకులకు తెలుగుపై అభిమానం లేదని, అలాంటి వారికి అవసరమైతే ఇది తెలుగు అని మనం నేర్పి, వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. శాంతా బయోటెక్‌ అధినేత డాక్టర్‌ వరప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల సంఖ్య, పత్రికల సంఖ్య పెరిగినా చదివే పాఠకుల సంఖ్య తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య ప్రభావానికి లోనైన యువతరాన్ని, చిన్న పిల్లలను ఆకట్టుకునే రచనలు రావాలని, ఆశావహ దృక్పథంతో రచనలు సాగాలని కోరారు. ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగు భాషలో సాధక బాధకాలను పరామర్శించే తరం పత్రికల్లో లేకుండా పోయిందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సాహిత్య అకాడెమీ కార్యదర్శి అగ్రహారం కృష్ణమూర్తి, ప్రసిద్ధ ఉర్దూ కవి షీన్‌ కాఫ్‌ నిజాం, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు తుర్లపాటి కుటుంబరావు, రాష్ట్ర సాంస్కృతికశాఖ, పురావస్తుశాఖ సంచాలకుడు హర్షవర్ధన్‌, చెన్నారెడ్డి, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జీవీ పూర్ణచందు పాల్గొన్నారు.
తెలుగు తల్లి విగ్రహావిష్కరణ
మహాసభల ప్రారంభానికి ముందు తుమ్మలపల్లి కళేక్షేత్రం ఎదుట తెలుగుతల్లి విగ్రహాన్ని రామోజీరావు, సినారె ఆవిష్కరించారు. మహాసభల సందర్భంగా రూపొందించిన 'తెలుగు పున్నమి' పుస్తకాన్ని రామోజీరావు ఆవిష్కరించారు.

Wednesday, August 3, 2011

తె. భా.స మహాసభకు హాజరైన రాయలసీమ,తమిళనాడు ప్రతినిధులు

రాజమండ్రి లో జూలై 31 న జరిగిన తెలుగు భాషోద్యమ సమాఖ్య 8 వ మహాసభ సందర్భంగా తెలుగు భాషొద్యమ సమాఖ్య అధ్యక్షులు సామల రమేష్ బాబు గారితో..రాయలసీమ,తమిళనాడు,కర్నాటక      ప్రతినిధులు తవ్వా ఓబుల్ రెడ్డి, ఎ.వీరాస్వామి, టి.మహానందప్ప, స.వెం.రమేష్, కాటుపాకం పురుషోత్తం,  క్రిష్ణ ప్ప, మునిరాజు, పుష్పరాజు , దామోదర్ రెడ్డి తదితరులు.