

‘సమాజాన్ని సమైక్యపరిచే తెలుగు’
సమాజాన్ని సమైక్య పరిచే శక్తి భాషా సంస్కృతులకే ఉందని రచయితల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మహాసభల్లో భాగంగా సోమవారం ఎస్వీఎస్ కల్యాణ మండపంలో ‘జాతీయతా భావం-రచయితల పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకోత్తర, మహత్తర త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ నేటి తరానికి తెలుగు మాట్లాడడమేగానీ చదవడం, రాయడం రావట్లేదన్నారు.
కలకత్తాకు చెందిన సంస్కృతాచార్యులు ఆచార్య ఉషాచౌదరి మాట్లాడుతూ జాతీయ భావాలకు, పరమత సహనం, వారసత్వానికి ఆది నుంచి భారతదేశం పెట్టింది పేరన్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నల్లవారి హక్కుల కోసం పోరాడి తెల్లవారి తుపాకులకు బలైన మార్టిన్ లూధర్ కింగ్ ఇంట్లో మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న చరిత్ర భారతదేశానిదన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు హర్షవర్థన్ మాట్లాడుతూ ఏ భాషనైనా కాలానుగుణంగా మార్చుకున్నప్పుడే మనుగడ సాధ్యమవుతుందని, మాతృభాష మృతభాషగా మారకుండా ఉంటుందన్నారు. సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించిన సిలికాన్ ఆంధ్రా కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తెలుగు భాషను ప్రపంచ భాషగా గుర్తింపు తెచ్చేందుకు కృషిచేద్దామన్నారు. కృష్ణా యూనివర్సిటీ మాజీ ఉపకులపతి మైనేని కేశవదుర్గాప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషను ఆధునికీకరించపోతే మనుగడ ఉండదన్నారు.అనంతరం తెలుగులో అంతర్జాల అన్వేషణ, ముద్రణారంగంలో సాంకేతిక తోడ్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అలాగే ఇ-పుస్తకాల గురించి వెంకట్రామ్, వికీపీడియా గురించి చావా కిరణ్, లిపి ఎలా రూపుదిద్దుకుంటుందో శివరావ్ వివరించారు. సీపీ బ్రౌన్ వేదికపై జరిగిన ఈ సదస్సులో తెలుగు ఫాంట్ అభివృద్ధి కమిటీ సభ్యుడు అమర్నాథ్రెడ్డి, ఆచార్య జి.ఉమామహేశ్వరరావు, డి.అంబరీష్, వి.వెంకటరమణ, కళాసాగర్, కొత్తపల్లి నారాయణస్వామి, పెద్ది సాంబశివరావు, సలాక రఘునాథశర్మ, రహిమానుద్దీన్, కె.వీరభద్రశాస్త్రి పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. ఆ వివరాలు..
* పల్లె నుంచి నగరాల వరకు అంతా తెలుగే మాట్లాడాలి. ఇంట్లో, బయట అమ్మ భాషే మాట్లాడాలి.
* రాష్ట్రంలో తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను వెంటనే ఏర్పాటు చేయాలని, దీనివల్ల భాషా సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి.
* రెండేళ్లుగా అధికార భాషా సంఘ కార్యవర్గాన్ని నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం విచారకరం. వెంటనే నియామకాలు జరపాలి.
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ'ని పునరుద్ధరించాలి.
* ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగులో బోధన తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల నెంబరు 86 విడుదల చేసినా దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని సమావేశాలు తప్పుపట్టాయి. (ఈ ఉత్తర్వు విడుదలయిన మూడు సంవత్సరాల తరువాత తమిళమాధ్యమంపై అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.) తెలుగు బోధించని ప్రభుత్వేతర పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి. గ్రామ స్థాయి నుంచి తెలుగు బోధన కోసం ఉద్యమాలు చేపట్టాలి.
* వచ్చే 'నందన'నామ సంవత్సరాన్ని తెలుగు భాషా సంస్కృతుల సంవత్సరంగా ప్రకటించి గ్రామస్థాయి నుంచి తెలుగుపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి.
* పాలన, బోధన భాషగా తెలుగు అమలుపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి.
* తెలుగు మాట్లాడే విద్యార్థులపై చర్యలు తీసుకునే విద్యా సంస్థలు ఉంటే నిరసనలు, ఆందోళనలు చేయాలి.
* తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ప్రోత్సాహంగా ఉద్యోగాల మౌఖిక పరీక్షల్లో అయిదు మార్కులు అదనంగా కేటాయించాలి
No comments:
Post a Comment