Sunday, October 2, 2011

వచ్చే ఏడాది విశాఖలో సెప్టెంబర్‌ 21, 22, 23 తేదీలలోతెలుగు అంతర్జాల సదస్సు

   international
కాలిఫోర్నియా : తెలుగుభాషకు ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రపంచ భాషగా చేసే కృషిని ఒక ఉద్యమంలా చేపట్టాలని అంతర్జాతీయ తెలుగు అంత ర్జాల సదస్సు నినాదమిచ్చింది. అమెరికాలో కాలిఫోర్ని యాలోని మిల్పిటాస్‌ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం, సిలికానాంధ్ర సంయుక్తంగా నిర్వహించిన సదస్సు శుక్రవారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం శని వారం) ముగిసింది. సమాచార సాంకేతిక శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ఆ శాఖలోని అంతర్జాల సలహామండలి సభ్యులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణకు తుది రూపమిచ్చారు. అంతర్జాలంలో తెలుగు భాష అభివృ ద్ధికి తగిన సాంకేతిక ఉపకరణాలను సిద్ధం చేయాలని, కంప్యూటర్‌లలో అందు బాటులో ఉన్న ప్రామాణిక ఉపకరణాలను మన స్థానిక భాషకు అనువుగా మలచుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవ డానికి అవ సరమైన బోధన, శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని, తెలుగు కోసం వివిధ రకాలైన అనువర్తనాలను రూపొందించాలని తీర్మానించారు. వీటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందు నిలుస్తుందని ఈ రంగంలో చైత న్యం తీసుకురావాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముగింపు సభకు మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షత వహించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ, ఈ సదస్సు విజయవంతమైందని, ఈ సదస్సులో చర్చించిన అంశాలపై రాబోయే రోజులలో విస్తృతమైన అభిప్రాయాలను సేకరిస్తామని అన్నారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌ 21, 22, 23 తేదీలలో విశాఖపట్టణంలో రెండవ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు జరిగే నాటికి చాలా పురోగతి సాధించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సదస్సు అధ్యక్షులు టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పేరి భాస్కరరావు, హైదరాబాద్‌ కేంద్రీ య విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య ఆవుల మంజులత, శాసనమండలి సభ్యుడు ఐలాపురం వెంకయ్య, సమా చార సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌ జాజు, ఆంధ్రప్రభ దినప త్రిక సంపాదకులు పి.విజయబాబు, నాలెడ్జ్‌ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణా ధికారి అమర్‌నాథ్‌ రెడ్డి, అంతర్జాల సలహా మండలి సభ్యులు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, వీవెన్‌, సిలికానాంధ్ర అధ్యక్షుడు కొండుభొట్ల దీన బాబు, సమన్వయ కర్త చామర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వైభవాన్ని చాటిన 'మనబడి' స్నాతకోత్సవం
అమెరికాలోని పదహారు రాష్ట్రాల్లో సిలికానాంధ్ర నడుపుతున్న 'మన బడి' కార్యక్రమం ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఆదర్శప్రాయమని సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశంసిం చారు. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌ నగరంలో జరిగిన మనబడి స్నాత కోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ, అమెరికాలో పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు నేర్పించేందుకు నాలుగేళ్ళ కిందట మనబడిని ప్రారంభించామని చెప్పారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ భాష నశిస్తే జాతి కూడా అంతరిస్తుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించి సిలికానాంధ్రను స్ఫూర్తిగా తీసుకుని భాషను కాపాడుకోవాలని కోరారు. ఈ స్నాతకోత్సవంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అమలు జరుగుతున్న మనబడిలో నాలుగో సంవత్సరం కోర్సు పూర్తి చేసుకున్న సుమారు 150 మంది విద్యార్థులకు పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలను అందచేశారు. మనబడి డీన్‌ తూములూరి శంకర్‌ తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య, డాక్టర్‌ ఆవుల మంజులత, అధ్యాపకుడు జె.చెన్నయ్య, సిలికానాంధ్ర అధ్యక్షుడు కొండుభొట్ల దీనబాబు, పూర్వ అధ్యక్షుడు చామర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.
-ఆంధ్రప్రభ