Thursday, September 14, 2017

అమ్మ భాషకు నీరాజనం

అమ్మ భాష సరిగా రానివారికి ఇతర భాషలు ఒంటపట్టడం కల్ల అన్నది జార్జి బెర్నార్డ్‌ షా చెప్పిన మాట. ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు సైతం ఆ సంగతే వెల్లడించాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో భాషాభిమానం అధికం. వారితో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు–ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాతృభాషకు ఎంతో అన్యాయం జరుగుతోందని భాషాభిమానులు చాన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీసుకున్న రెండు నిర్ణయాలు ఊరట కలిగిస్తాయి. ఒకటో తరగతి మొదలుకొని పన్నెండో తరగతి వరకూ తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాలన్నది అందులో ఒకటి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలూ ఇకపై బోర్డులన్నిటినీ తెలుగులోనే రాయాలన్నది మరో నిర్ణయం. ఉత్తరాది రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటకల్లో బోర్డులన్నీ అక్కడి భాషల్లో ఉంటాయి. కనీసం ఆ దుకాణాలు లేదా సంస్థలు ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నించినా ఇంగ్లిష్‌లో ఒక్క ముక్క కూడా రాసి ఉండదు.

మన దగ్గర మాత్రం సామాన్యులకు అర్ధం కాకుండా ఇంగ్లిష్‌లోనే బోర్డులుంటాయి. ఆమధ్య తెలుగులో కూడా ఉండాలన్న నిబంధన పెట్టడం వల్ల ఏదో ఒక మూల దాన్ని రాయడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ చెబుతున్న ప్రకారం బోర్డులు ఇకపై తెలుగులో తప్పనిసరిగా ఉండాలి. ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టం. తెలుగు పాఠ్యాంశాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతున్నది. దాన్ని పాటించే విద్యా సంస్థలకు మాత్రమే మాత్రమే రాష్ట్రంలో అనుమతులుంటాయని కూడా కేసీఆర్‌ చెప్పారు. దీనికి కొనసాగింపుగా మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ తెలుగు పాఠ్యాంశాలకు తెలంగాణ సాహిత్య అకాడమీ పాఠ్య ప్రణాళికలను రూపొందించి పుస్తకాలు ముద్రించాలని, వాటిని మాత్రమే అన్ని విద్యా సంస్థలూ అనుసరించవ లసి ఉంటుందని కూడా నిర్దేశించారు.

భాషా వికాసానికి జరిగే కృషిలో ప్రభుత్వాలది క్రియాశీలక పాత్ర. ఆ పాత్రను ప్రభుత్వాలు సక్రమంగా పోషిస్తేనే మాతృభాష బతికి బట్ట కడుతుంది. నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాక దేశంలో అవతరించిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. చిత్రమేమంటే ఆ తర్వాత పదేళ్లకుగానీ తెలుగును అధికార భాషగా గుర్తించే తీర్మానం శాసనసభ చేయలేకపోయింది. ఆ విషయంలో ఉత్తర్వులు జారీ చేయడానికి ఏళ్లూ పూళ్లూ పట్టింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు డిగ్రీ స్థాయి వరకూ మాతృభాషలో విద్యా బోధన ఉండాలని సంకల్పించి తెలుగు అకాడమీకి ఆ బాధ్యత అప్పగించి అన్ని పాఠ్యాంశాలూ తెలుగులో లభ్యమయ్యేందుకు దోహదం చేశారు.

ఆ విషయంలో తర్వాత వచ్చిన పాలకులు మరింత చురుగ్గా వ్యవహరించి తెలుగుపై శ్రద్ధ పెట్టి ఉంటే భాషా వికాసం మరింతగా సాధ్యమయ్యేది. భాష జాతికి తల్లివేరులాంటిది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఏ జాతి అయినా ఎదుగుతుంది. ఈ సంగతి మనకంటే తమిళనాడు, కర్ణాటక నేతలకు బాగా తెలుసు. మాతృభాష కళ్లయితే పరాయిభాష కేవలం కళ్లజోడని తమిళనాడు తొలి ముఖ్యమంత్రి అన్నాదురై అన్నారు. ఆ దృష్టితోనే ఆయనా, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తమిళభాషకు పెద్ద పీట వేశారు. దాని సర్వతోముఖాభివృద్ధికి పాటుబడ్డారు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు ఆచరణలో సమస్యలెదురయ్యే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటిచోట్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి ఆధ్వర్యంలో విద్యా సంస్థలు నడుస్తున్నాయి.

ఆ సంస్థలు సైతం తెలుగును ఇకపై ఒక పాఠ్యాంశంగా బోధించడం తప్పనిసరి. అలాగే కొన్ని విద్యా సంస్థలు వేటికవి వేర్వేరు ప్రైవేటు ప్రచురణకర్తలు వెలువరించిన తెలుగు పుస్తకాలను వాడుతున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఇది కుదరదు. చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం ఉంటే ఈ నిబంధనలు అమలయ్యేలా చూడటం పెద్ద కష్టం కాదు. ఏ ప్రాంత భాష అయినా నేర్చుకోవాలనుకునేవారు అందుకు శాస్త్రీయంగా రూపొందించిన పాఠ్యాంశాన్నే అనుసరించాలి. ఆ పాఠ్యాంశం అక్కడి సంస్కృతిని, నుడికారాన్ని ప్రతిబింబించాలి. అప్పుడు మాత్రమే తాము ఉంటున్న రాష్ట్రం గురించిన సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.

తెలుగు భాషా వైభవానికి కృషి చేస్తానని చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయంలో ఇంతవరకూ ప్రగతి సాధించకపోగా అందుకు విరుద్ధమైన పోకడలకు పోతున్నారు. తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక బడ్జెట్‌ కేటా యిస్తామని వాగ్దానం చేశారు. తెలుగు భాషా పీఠం ఏర్పాటు చేస్తామన్నారు. స్వయం ప్రతిపత్తిగల ప్రాధికార సంస్థను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రత్యేక తెలుగు కేంద్రం ఉంటుందన్నారు. వీటన్నిటికీ మించి తెలుగును రెండో జాతీయ భాషగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లారు. కానీ ‘రెండో జాతీయ భాష’ గురించి ప్రధాని నరేంద్ర మోదీ వద్ద కనీసం ప్రస్తావనైనా తెచ్చారో లేదో అనుమానమే.

కనీసం పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీలు సైతం ఇంతవరకూ దీని ఊసెత్తలేదు. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వచ్చినా అది నామమాత్రం గానే మిగిలింది. తెలుగుకు పల్లకీ మోత సంగతలా ఉంచి మున్సిపల్‌ పాఠశాలలను ఒక్క కలం పోటుతో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలుగా మారుస్తూ గత జనవరిలో ఉత్తర్వులు జారీచేశారు. అందుకు సంబంధించి అభ్యంతరాలు తలెత్తడంతో తెలుగు మీడియం కూడా కొనసాగుతుందని ప్రకటించారు. కనీసం ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వ తాజా నిర్ణయాలను గమనించాకైనా  మార్పు వస్తే... మాతృభాషా పరిరక్షణకు కృషి చేస్తే మంచిది .
సాక్షి దినపత్రిక సంపాదకీయం ౧౪-౦౯-౨౦౧౭ .

Wednesday, September 13, 2017

హైదరాబాద్‌లో డిసెంబరు15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను
ముందుగా అనుకున్నట్లుగా అక్టోబరులో కాకుండా డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానిస్తామని.. రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో ఉత్సవాలను జరుపుతామని తెలిపారు. మహాసభలను పురస్కరించుకొని ఆయన తెలుగును పరిరక్షించే కీలక నిర్ణయాలను ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభలపై మంగళవారమిక్కడ ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందినీ సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘అక్టోబరులోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. కానీ, 5 నుంచి 9 వరకు దాదాపు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ పర్యాటక సదస్సు హైదరాబాద్‌లో జరుగుతుంది. నవంబరు 28 నుంచి దాదాపు 170 దేశాలు పాల్గొనే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్‌కు ఆతిథ్యమిస్తోంది. ఈ రెండు కార్యక్రమాల నిర్వహణలో అధికారయంత్రాంగం తలమునకలై ఉన్న తరుణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని భావించాం. అందుకే డిసెంబరులో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నందున తెలుగు భాషను పరిరక్షించే బాధ్యత తమపై ఉందన్నారు.
సాహిత్య అకాడమీ పుస్తకాలే ప్రామాణికం
తెలుగును విధిగా బోధించాలన్న నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో ఇకపై ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకొని బోధించడం కుదరదు. సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్‌తో ఉన్న పుస్తకాలనే బోధించాలి. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. దీనిపైన, తెలంగాణలోని బోర్డులను తెలుగులోనే రాయాలనే నిర్ణయంపైనా త్వరలోనే మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేస్తాం.
వేదికలు
ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి. రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కళాశాల మైదానం, భారతీయ విద్యాభవన్‌, పింగళి వెంకట్రామిరెడ్డి హాల్‌, శిల్ప కళావేదిక, ఇతర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి.
తెలంగాణ తెలుగుకు ప్రాశస్త్యం
తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి జరిగిన కృషిపై చర్చా గోష్ఠులుంటాయి. తెలంగాణలో వర్ధిల్లిన తెలుగును ప్రపంచ నలుమూలలకూ తెలిపే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలుంటాయి. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి, కలుపుపాట, నాటు పాట, బతుకమ్మ పాటలు, వినోద ప్రక్రియ కార్యక్రమాలుంటాయి. తానీషా-రామదాసుల మధ్య అనుబంధం, రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, శారదాకారులు, హరికథ ప్రక్రియ తదితర అంశాలను ప్రదర్శించాలి. పద్యగానం, సినీపాటల విభావరి నిర్వహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే కాట్ల పాటలు, కోత పాటలు, దుక్కి పాటలు, జానపద గేయాలను ఆలపించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పాడే పాటలు ఒకతరం నుంచి మరో తరానికి ఎలా చేరాయో కళ్లకు కట్టినట్లు చూపించాలి.
ఆహ్వానాలు
దేశ విదేశాల్లోని తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానిచాలి. మహాసభల ఔచిత్యాన్ని చాటడానికి సన్నాహాక సమావేశాలు నిర్వహించాలి. అమెరికా, యూరప్‌, గల్ఫ్‌ దేశాలతో పాటు మారిషస్‌, సింగపూర్‌, మలేసియా లాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సమావేశాలు జరపాలి. ఏపీతో పాటు దేశం నలుమూలల్లో, తెలంగాణలోని అన్ని ముఖ్యపట్టణాల్లో ఈ సమావేశాలు జరగాలి. కేవలం తెలుగువారినే గాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞాన్‌పీఠ్‌ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందిన ప్రముఖులను ఆహ్వానించాలి.
* మహాసభల నేపథ్యంలో తెలుగు భాష, ప్రక్రియలకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి. తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు వైభవానికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీవేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానం చేయాలి.
* అతిథులందరికీ ప్రభుత్వం తరఫునే బస, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించాలి. మహాసభలకు ముందే తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే పుస్తకాల ముద్రణ జరగాలి. అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపించాలి. తెలంగాణ పరిచయం కోసం ప్రత్యేక డాక్యుమెంటరీని తయారు చేయాలి.
సినారె స్మారక మందిరం
నగరంలో సి.నారాయణరెడ్డి స్మారకమందిరాన్ని నిర్మించాలి. రెండు మూడు రోజుల్లోనే స్థలం ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి. అధికార భాషా సంఘం, సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం, గ్రంథాయల పరిషత్‌ తదితర సంస్థలు కీలక భూమిక నిర్వహించాలి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయ స్థాయిల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించాలి. మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ నగరాన్ని అలంకరించాలి. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేయాలి. జిల్లాల్లో కూడా అలంకరణలుండాలని కేసీఆర్‌ ఆదేశించారు.
                                                                            -ఈనాడు - హైదరాబాద్‌



Tuesday, September 12, 2017

ఇంటర్ దాకా తెలుగు తప్పనిసరి.. సీఎం కేసీఆర్

హైదరాబాద్: సెప్టెంబరు12: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్ తెలుగు భాషా పరిరక్షణకు పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను ఖచ్చితంగా ఒక సెబ్జెక్టుగా బోధించాలి. అదేవిధంగా తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులను ఖచ్చితంగా తెలుగులోనే రాయాలని పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో ప్రపంచ తెలుగు మహసభల నిర్వహణపై సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్ష చేపట్టారు. మహాసభల నిర్వహణకు రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్య అకాడమీకి రూ. 5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ. 2 కోట్లు నిర్వహణ ఖర్చుల కింద మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా పనిచేయనుంది. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగు భాషను పరిరక్షించే నిమిత్తం సీఎం రెండు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
తెలుగును ఖచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో ఇకపై అనుమతి లభించనుంది. ఉర్థూ కోరుకునే విద్యార్థులకు ఉర్థూ భాష కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండొచ్చు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ రూపకల్పన చేయాలన్నారు. సిలబస్ రూపొందించి వెంటనే పుస్తకాలు ముద్రించాలని తెలిపారు. సాహిత్య అకాడమీ రూపొందించిన ఈ సిలబస్‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలన్నారు. ఇకపై ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా, ఖచ్చితంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా అన్ని రకాల సంస్థల బోర్డులపైన స్పష్టంగా పేర్లను తెలుగులో రాయాలన్నారు. ఇతర బాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమన్నారు. ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
* నమస్తే తెలంగాణా