Monday, March 4, 2019

మైదుకూరు, కడప జిల్లా, మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, 2019

సరికొత్త ముద్రణ పొందిన .'గండికోట'.పుస్తకం! (2019)

గతనెల 9-10 తేదీలలో జరిగిన నాలుగవ గండికోట ఉత్సవాల సందర్భంగా నేను రచించిన గండికోట పుస్తకం నాలుగవ ఎడిషన్ వెలువడింది. ఉత్సవాల ప్రధాన వేదికపై ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది . మైదుకూరు తెలుగు సమాజం ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
*******************
రాయల సీమలో ప్రముఖ చారిత్రక ప్రదేశంగా పర్యాటక కేంద్రంగా పేరొందిన ప్రాంతం గండికోట. జమ్మలమడుగు పట్టణానికి 14కి.మీ 
దూరంలో పెన్నానదికి కుడివైపున ఏర్పడిన పొడవైన గండిపై నిర్మించడంతో దీనికి ఆ పేరువచ్చింది. క్రీ.శ.1123 జనవరి 9వ కళ్యాణీ చాళుక్య రాజు త్రైలోక్య మల్ల కు సామంత రాజైన కాకరాజు ఈ కోటని నిర్మించినట్టు దుర్గం కైఫియత్‌ ద్వారా చరిత్రకారులు గుర్తించారు.
రాయల సీమలో అత్యంత విశిష్టమైన కట్టడంగా పేరొందిన గండికోటను రచయిత తవ్వాఓబుల్ రెడ్డి మూడు నెలల పాటు అక్కడ అణువణువు పర్యటించి ఆ చరిత్ర విశేషాలని తన రచనల ద్వారా 'గండికోట' పేరుతో మొదట పుస్తకరూపంలోకి తీసుకు రావడం మంచి పరిణామం.ఆ తర్వాత వెంటనే మలి ముద్రణ. ఆపై 3, 4 ముద్రణలు..! కేవలం చారిత్రక పరిశీలనాత్మక పుస్తకంగానే కాకుండా యాత్రికులకు ఒక మంచి గైడ్‌ అని చెప్పొచ్చు. రచయితది సొంత జిల్లానే అయినా కాలక్రమంలో కోటపై జరిగిన దండయాత్రల కారణంగా అక్కడ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. శిధిలమైన నిర్మాణాలు, శాసనాలు, నాణేల ఆధారాలని, ఒకప్పటి కోట నిర్మాణ నైపుణ్యతని, నాటి రాచరిక పాలనని, అప్పటి సామాజిక పరిస్థితులని, కోట నిర్మాణ నైపుణ్యతని పాఠకులకి కళ్లకుకట్టినట్టు చేయడం రచయిత అకుంఠిత దీక్షకి నిదర్శనం. చరిత్ర కేవలం పాలక వంశాలకి సంబంధించినదిగా కాకుండా అప్పటి ప్రజల సామాజిక జీవనానికి అద్దం పట్టేదిగా వుండాలి. అప్పుడే ఒకప్పటి చరిత్ర భావితరాలకీ సాదృశ్యమవుతుంది. ప్రఖ్యాత ఫ్రెంచ్‌ యాత్రికుడు, వజ్రాల వ్యాపారి టావెర్నియర్‌చే రెండవ హంపీగా అభివర్ణించబడ్డ గండికోట నిర్మాణాల్లో ఎర్రకోనేరు, రామబాణపు బురుజు, ఆయుధ కర్మాగారం, రాయలచెరువు, ఫరాబాగ్‌ జలపాతం, కందకాలు, అగడ్తులు, రహస్య మార్గాలు, మైలవరం, చంద్రగిరి మ్యూజియాల్లో పొందుపరచబడిన శిల్పాల విశేషాలు, పెమ్మసాని వీరుల చరిత్రపై , నంద్యాల వంశీకులైన అవుకు రాజుల గండికోట పాలనా విశేషాలపై అందించిన సమగ్ర సమాచారం పాఠకులని గండికోటవైపు వేలుపట్టి నడిపిస్తుంది. శతాబ్దాల నాటి వలస చరిత్రలో భాగమైన గండికోట చరిత్రని మౌఖికంగా అక్కడ లభ్యమవుతున్న కథలు, మెకంజీ కైఫియత్‌లలో నమోదైన కథనాలని నిజనిర్ధారణ చేసుకొని గండికోట చరిత్ర రచనకు రచయిత పూనుకోవడం అభినందనీయం. 
తవ్వా ఓబుల్ రెడ్డి ద్వారా రచించబడిన 'కడప కథ', రాయలసీమ వైభవం' గ్రంథాలు ఇప్పటికే ఈ ప్రాంతపు సంస్కృతిని ఇతర ప్రాంతాల వారికి పరిచయంచేసేందుకు దోహదపడ్డాయి. గొప్ప పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన గండికోట చరిత్ర ప్రధాన ఘట్టాలు, స్థానిక రాజ వంశస్తుల వివరాలతోపాటు చరిత్ర ఘట్టాలని ప్రతిబింబించే చిత్రాలు, రూట్‌ మ్యాప్‌లతో పొందుపరిచిన ఈ పుస్తకం నేటి తరానికి గండికోట చరిత్రని మరింత దగ్గర చేస్తుంది. ఈ పుస్తకం అత్యంత పాఠకాదరణ పొంది అనతికాలంలోనే నాలుగవ ముద్రణ పొందడం విశేషం. ప్రతిముద్రణలోనూ గండికోటకు సంబంధించి రచయిత వెలుగులోకి తెచ్చిన నూతన పరిశోధనాంశాలను పొందుపరుస్తూ రావడం అభినందనీయం. ఇటీవల జరిగిన గండికోట వారసత్వ ఉత్సవాలలో నాలుగవ ముద్రణ గా పుస్తక ఆవిష్కరణ జరిగింది.
***
గండికోట
సరికొత్త ముద్రణ 2019
రచయిత : తవ్వా ఓబుల్‌ రెడ్డి
పేజీలు :132
వెల :100/-
రచయిత సెల్: 9440024471